Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూలై 15: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆకతాయిలపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యంతో భీమిలి పోలీసులు ప్రత్యేక తనిఖీలను కొనసాగిస్తున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ దివాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాల్లో రెండో రోజు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులకు మహిళలను గౌరవించడం, విద్యార్థినుల భద్రత, ఈవ్టీజింగ్ వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమిలి సీఐ దివాకర్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా విద్యాభ్యాసం కొనసాగించేలా సురక్షిత వాతావరణం కల్పించడం భీమిలి పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించడంతో పాటు ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. కళాశాలలు, పాఠశాలలు, బస్ స్టాప్లు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించి మహిళల భద్రతకు భీమిలి పోలీసులు కట్టుబడి ఉంటారని తెలిపారు.
Admin
Neti Sakshyam